Hyderabad: బుధవారం చైన్ స్నాచింగ్‌కు పాల్పడిన వారే.. గురువారం మళ్లీ రెచ్చిపోయారు.. పోలీసులకు సవాల్!

  • రెచ్చిపోతున్న గొలుసు దొంగలు
  • వరుసగా రెండో రోజూ చోరీలు
  • 40 నిమిషాల్లో నాలుగు స్నాచింగ్‌లు

హైదరాబాద్‌లో గొలుసు దొంగలు పోలీసులకు సవాలు విసురుతున్నారు. బుధవారం ఐదు చోట్ల గొలుసులు లాక్కెళ్లిన దుండగులు, గురువారం 40 నిమిషాల వ్యవధిలో నాలుగు చోట్ల దొంగతనాలకు పాల్పడ్డారు. హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు చోట్ల, వనస్థలిపురం, చైతన్యపురి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒక్కో చోట చోరీలకు పాల్పడ్డారు. మొత్తంగా 12.5 తులాల బంగారు గొలుసులను మహిళల మెడల్లోంచి తెంపుకెళ్లారు.

బైక్‌పై వచ్చిన దొంగల్లో ఒకడు పసుపు చొక్కా ధరించగా, మెడలో రుమాలు కట్టుకున్నట్టు సీసీ టీవీ ఫుటేజీ ద్వారా తెలుస్తోంది. బైక్ నడుపుతున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకున్నట్టు బాధితులు తెలిపారు. ఈ చోరీలన్నీ ఒకే ముఠా పనేనని పోలీసులు నిర్ధారించారు. వనస్థలిపురంలో వాకింగ్‌కు వెళ్లి వస్తున్న మహిళ మెడలోని నాలుగు తులాల చైను లాక్కెళ్లిన దుండగులు, మన్సూరాబాద్‌లోని లెక్చరర్స్ కాలనీలో ఇంటిబయట వేచి చూస్తున్న మహిళ మెడలోని గొలుసును తెంపుకెళ్లారు. అలాగే, అబ్దుల్లాపూర్‌లో ఉదయం ఆటో కోసం ఎదురుచూస్తూ రోడ్డు పక్కన నిల్చున్న మహిళ మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును బైక్‌పై వచ్చిన దుండగులు లాక్కెళ్లారు.

More Telugu News