jagan: జగన్ ఇంకా ఎన్నిరోజులు ప్రజలను ఇలా మోసం చేస్తారు?: సీఎం రమేశ్ ఫైర్

  • వైసీపీ నేతలు బీజేపీతో కుమ్మక్కయ్యారు
  • ఏపీకి అన్యాయం చేస్తున్నారు
  • సీమ సమస్యలపై జగన్ కు ఏమాత్రం పట్టింపులేదు

కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం పార్లమెంట్ లో పోరాటం చేస్తే వైసీపీ నేతలు స్పందించలేదని, బీజేపీతో కుమ్మక్కై ఏపీకి అన్యాయం చేస్తున్నారని టీడీపీ నేత సీఎం రమేశ్ మండిపడ్డారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, రాయలసీమ సమస్యలపై జగన్ కు ఏమాత్రం పట్టింపులేదని విమర్శించారు.

2007-2008లో బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ కు పదమూడు వేల ఎకరాలను దాదాపు ముప్పై కోట్ల రూపాయలకు గాలి జనార్దన్ రెడ్డికి కట్టబెట్టారని గుర్తుచేశారు. ఆ పెద్దమనిషి ఈ భూములను బ్యాంకులో తనఖాపెట్టి రూ.1200 కోట్ల రుణం తీసుకున్నారని, అందులో, యాభై, అరవై కోట్లు ఖర్చుపెట్టి మిగిలింది దోచుకున్నారని ఆరోపించారు. ఈ జిల్లాకు స్టీల్ ప్లాంట్ రాకుండా ఉండేందుకు జగన్ యత్నించారని, కడప జిల్లా ప్రజల బంగారు భవిష్యత్ ను పాడు చేసిన నాయకుడు ఆయనా కాదా? అని ప్రశ్నించారు. ఇంతపెద్ద కార్యక్రమం ఇక్కడ జరుగుతుంటే, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఢిల్లీలో మోసపూరిత దీక్షను వైసీపీ చేస్తోందని విమర్శించారు. ఇంకా ఎన్నిరోజులు ప్రజలను ఇలా మోసం చేస్తారు? అంటూ వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News