Narendra Modi: జగన్ ముసుగు తీస్తే కనపడేది నరేంద్ర మోదీ మొహమే!: సీఎం చంద్రబాబు ఎద్దేవా

  • ప్రతిపక్ష పార్టీల నాయకులు నాటకాలాడుతున్నారు
  • ఏపీ హక్కుల కోసం పవన్ కల్యాణ్ ఏం చేస్తారో చెప్పాలి?
  • అందరికీ న్యాయం చేసేందుకు ముందుకు వెళ్తున్నాం

ఏపీలో ప్రతిపక్ష పార్టీల నాయకులు నాటకాలాడుతున్నారని, వాళ్ల ముసుగులు తీయాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. అనంతపురంలో జరిగిన ధర్మపోరాట దీక్ష సభలో ఆయన మాట్లాడుతూ, వైసీపీ అధినేత జగన్, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ లపై విమర్శలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి ముసుగు తీస్తే కనపడేది నరేంద్రమోదీ మొహమేనని, ఏపీ హక్కుల సాధన కోసం పవన్ కల్యాణ్ ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.

మనకు కావాల్సింది కులం, మతం, ప్రాంతం కాదని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పార్టీ కావాలని అన్నారు. ఈ రోజున టీడీపీ ఏ కులాన్నీ పక్కనపెట్టలేదని, తాము చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా అందరికీ ప్రయోజనం కలిగిందని, సమాజంలో అందరికీ న్యాయం చేసేందుకు ముందుకు వెళ్తున్నామని అన్నారు. అహంతోనో లేదా వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకునో రాష్ట్రానికి అన్యాయం చేస్తే చరిత్ర మనల్ని క్షమించదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఎంత గొప్ప పదవి వస్తే అంతగా అణగిమణగి ఉండాలని, సేవా భావంతో పనిచేయాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు.

More Telugu News