Chandrababu: కుట్రలను ఛేదించడంలో చంద్రబాబు మగాడు.. మొనగాడు!: టీడీపీ ఎంపీ జేసీ

  • తాను ఎల్లకాలం పీఎంగా ఉండేందుకు మోదీ ప్లాన్   
  • రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేసేందుకు కుట్ర  
  • దేశం యావత్తూ బీజేపీని తిరస్కరిస్తోంది

నాడు ఎన్టీఆర్ పై నాదెండ్ల భాస్కరరావు కుట్ర చేస్తే ఒంటి చేత్తో, ఎవరి సహాయ సహకారాలు లేెకుండా ఆ కుట్రను భగ్నం చేసి మళ్లీ ఆయన్ని సీఎం చేసిన ఘనత చంద్రబాబు నాయుడిదని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అనంతపురంలో జరుగుతున్న ధర్మపోరాటదీక్షలో పాల్గొన్న జేసీ మాట్లాడుతూ, నాడు ఎన్టీఆర్ ని గద్దె దింపడమనేది బాధాకరమైనప్పటికీ, రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా బాబు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు.

ఈ రోజు రాష్ట్రాన్ని ఛిన్నాభిన్నం చేసేందుకు కుట్ర జరుగుతోందని అంటూ ఆయన కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ ఎల్లకాలం పీఎంగా ఉండేందుకు కుట్ర జరుగుతోందని, ఆ కుట్రను భగ్నం చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని, కుట్రలను ఛేదించడంలో బాబు మొనగాడు, మగాడని ప్రశంసించారు. దేశం యావత్తూ ఇప్పుడు బీజేపీని తిరస్కరిస్తోందని అన్నారు. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు అహర్నిశలు కష్టపడుతున్నారని ప్రశంసించారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్న కోరిక చంద్రబాబుకు ఉందని, దాని కోసం ఆయన తన కుటుంబాన్ని, స్నేహితులను, అందరినీ మరిచిపోయి ఆ కార్యక్రమంలో ఉన్నారని అన్నారు.

More Telugu News