Narendra Modi: మోదీని విమర్శించిన దివ్యాంగుడు.. కర్రతో చావగొట్టిన బీజేపీ నేత!

  • ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ లో దారుణం
  • అఖిలేశ్ కే ఓటు వేస్తానన్న దివ్యాంగుడు
  • నిందితుడిపై రౌడీ షీట్ ఉందన్న పోలీసులు

ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ఓ సామాన్యుడిపై బీజేపీ నేత ప్రతాపం చూపించాడు. అతడిని కర్రతో చావగొట్టాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉత్తరప్రదేశ్ లోని సంభాల్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

జిల్లాలోని చందుసి మండలం ఖర్జా గేట్‌ ప్రాంతానికి చెందిన మనోజ్ గుజ్జార్‌ అనే వ్యక్తి దివ్యాంగుడు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ ఆఫీసు వద్దకు వచ్చిన మనోజ్.. ప్రధాని మోదీతో పాటు సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలనపై విమర్శలు గుప్పించాడు. రాబోయే ఎన్నికల్లో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ కే ఓటు వేస్తానని స్పష్టం చేశాడు.

దీంతో అక్కడే ఉన్న బీజేపీ నేత మహ్మద్ మియాన్ సహనం కోల్పోయాడు. కర్ర తీసుకుని అతడిని విచక్షణారహితంగా చావబాదాడు. కాగా, మియాన్ పై ఇప్పటికే రౌడీ షీట్ ఉందని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ వ్యవహారంపై మియాన్ స్పందిస్తూ..  ప్రధాని మోదీ, సీఎం యోగిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతోనే తాను దాడి చేశాననీ, మనోజ్ కు క్షమాపణలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.

More Telugu News