Chandrababu: రుణమాఫీకి సహకరించకుండా కేంద్రం మోకాలడ్డింది: వ్యవసాయంపై చంద్రబాబు శ్వేతపత్రం

  • అయినా ఒకేసారి రూ.50 వేల రుణమాఫీ
  • దేశంలో ఏపీ ప్రభుత్వం సాధించిన ఘనత ఇది
  • కేంద్రం ఇవ్వాల్సిన రూ.16వేల కోట్లకు కోత విధించింది

తెలుగుదేశం ప్రభుత్వం రైతు రుణమాఫీని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి ముందడుగు వేసేందుకు ప్రయత్నించినా కేంద్రం మోకాలడ్డిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అయినప్పటికీ ఒకేసారి రూ.50 వేల చొప్పున రుణమాఫీ చేసిన ఘనతను తమ ప్రభుత్వం దక్కించుకుందని చెప్పారు. 10 శాతం వడ్డీ చెల్లిస్తూ నాలుగు విడతల్లో మొత్తం 24 వేల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసినట్లు తెలిపారు.

62 ప్రాధాన్య ప్రాజెక్టుల్లో 17 పూర్తయ్యాయని, మరో 6 ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సంక్షేమ రంగంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు, అనుబంధ రంగాల్లో సాధించిన ప్రగతిపై ముఖ్యమంత్రి బుధవారం శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రుణమాఫీకి సహకరించాలని కేంద్రాన్ని ఎంత కోరినా కనికరించలేదన్నారు. పైగా రాష్ట్రానికి ఇవ్వాల్సిన 16 వేల కోట్ల రూపాయల నిధులకు కోత విధించారని చెప్పారు.

అభివృద్ధికి వ్యవసాయమే ఊతమని, కొనుగోలు శక్తి పెరగాలంటే వ్యవసాయంపై ఆధారపడి వున్న 65 శాతం ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడాలన్నారు. అందుకే తమ ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేసిందని తెలిపారు.

More Telugu News