Kerala: ప్రేయసి కోసం పురుషుడుగా మారిన 'ఆమె'... మోసం చేసిన ప్రియురాలు!

  • కేరళలో వెలుగులోకి వచ్చిన వింత ప్రేమ కథ
  • దర్శన్ గా మారిన అర్చన
  • మరో వ్యక్తితో వివాహం నిశ్చయించుకున్న ప్రేయసి

ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేమని భావించగా, వారిద్దరిలో ఓ యువతి లింగమార్పిడి చేయించుకుని పురుషుడిగా మారింది. ఆపై ప్రియురాలు మొహం చాటేయగా, ఏం చేయాలో పాలుపోక విలపిస్తున్న 'ఆమె' విచిత్ర ప్రేమ కథ కేరళలో వెలుగులోకి వచ్చింది.

మరిన్ని వివరాల్లోకి వెళితే, పెరువన్నముళి ప్రాంతానికి చెందిన అర్చనా రాజ్‌ (23), వడకరాకు చెందిన 22 ఏళ్ల యువతి కలసి పనిచేస్తున్న వేళ ప్రేమించుకుని, పెళ్లి చేసుకోవాలని భావించారు. అర్చన లింగమార్పిడి చేసుకునేందుకు సిద్ధంకాగా, ఈ సంవత్సరం అక్టోబరు 25న చెన్నైలోని ఓ ఆసుపత్రిలో రూ. 2 లక్షలకు పైగా ఖర్చు పెట్టి, శస్త్రచికిత్స చేయించుకుని పురుషుడిగా మారి, దర్శన్ గా పేరు మార్చుకుంది.

ఆపై దర్శన్ ప్రేమించిన యువతి హ్యాండిస్తూ, మరో పురుషుడితో వివాహానికి ముహూర్తాన్ని నిర్ణయించు కోగా, మీడియాకు ఎక్కి మరీ, దర్శన్ తాను ఎలా మోసపోయిందీ చెప్పుకున్నాడు. కోజికోడ్‌ లో మీడియాతో మాట్లాడిన దర్శన్, తనను ప్రేయసి మోసం చేసిందన్న ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ప్రజల దృష్టిలో జోకర్‌ అయిపోయానని అన్నాడు. ఆమె బలవంతంతోనే తాను పురుషుడిగా మారానని, మాటతప్పిన ఆమెపై కోర్టులో కేసు పెట్టనున్నానని చెప్పాడు.

More Telugu News