Train Track: 14 అడుగుల ఎత్తయిన గోడను సెకన్లలో ఎక్కేసి హాస్టల్ నుంచి టీనేజర్ పరారీ!

  • రైలు పట్టాలపై కనిపించిన 15 ఏళ్ల బాలిక
  • తీసుకెళ్లి వసతిగృహంలో ఉంచి కౌన్సెలింగ్
  • 76 సెకన్లలో గోడ దూకి పరారీ

ఉత్తరప్రదేశ్ లోని ఓ హాస్టల్ నుంచి 15 సంవత్సరాల బాలిక పరారుకాగా, సీసీటీవీ ఫుటేజ్ లు చూసిన పోలీసులు, బాలిక తప్పించుకున్న విధానాన్ని చూసి విస్తుపోయారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, బస్తీ జిల్లాకు చెందిన ఆ బాలిక కొన్ని రోజుల క్రితం రైల్వే పట్టాలపై అనుమానాస్పద స్థితిలో కనిపించగా, పోలీసులు ఆమెను చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు.

దీంతో ఆమెను మోతీనగర్ ప్రాంతంలోని వసతిగృహంలో ఉంచి గత మూడు రోజులుగా అధికారులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. నాలుగో రోజున, ఉదయం 7.30 గంటల సమయంలో ఆమె తప్పించుకుంది. దాదాపు 14 అడుగుల ఎత్తయిన గోడను ఆమె 76 సెకన్ల వ్యవధిలో ఎక్కేసి, రూఫ్ పైకి చేరుకుని, పక్కనే ఉన్న బిల్డింగ్ పైకి ఎక్కి పారిపోయింది. ఆమె పారిపోవడాన్ని గమనించని వసతిగృహం అధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హాస్టల్ లో ఉండటం ఇష్టంలేకనే ఆమె పారిపోయి ఉండవచ్చని భావిస్తున్న పోలీసులు, గాలింపు మొదలు పెట్టారు.

More Telugu News