jagan: పంచాయతీ బోర్డు మెంబర్ కు ఉన్న అనుభవం కూడా జగన్ కు లేదు: చంద్రబాబు

  • అన్నీ ఇచ్చేస్తామంటూ జగన్ కబుర్లు చెబుతున్నారు
  • ఆయనకు ఎకనామిక్స్, సోషియాలజీ తెలియదు
  • ఇలాంటి అనుభవ శూన్యులతో రాష్ట్రానికి ప్రమాదకరం

ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. పంచాయతీ బోర్డు మెంబర్ కు ఉన్న అనుభవం కూడా జగన్ కు లేదని ఆయన దుయ్యబట్టారు. అన్నీ ఇచ్చేస్తామంటూ జగన్ కబుర్లు చెబుతున్నారని... ఆయనకు ఎకనామిక్స్, సోషియాలజీ తెలియదని విమర్శించారు. జగన్ లాంటి అనుభవ శూన్యులతో రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదకరమని చెప్పారు. సంక్షేమ రంగంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిపై ఈరోజు చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, కేఎఫ్సీ, మెక్ డొనాల్డ్స్ కన్నా అన్న క్యాంటీన్లలోనే శుభ్రత, నాణ్యత ఎక్కువని చెప్పారు. ఇంత తక్కువ ధరలో నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్న క్యాంటీన్లు ఎక్కడున్నాయో చెప్పాలని అన్నారు. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో కొంత భాగాన్ని అమరావతి నిర్మాణానికి కేటాయిస్తే... ఇతర సంక్షేమ పథకాలను అమలు చేయలేమని చెప్పారు. ఈ కారణం వల్లే కొత్త పద్ధతుల్లో రాజధాని కోసం నిధులను సమీకరిస్తున్నామని తెలిపారు.


More Telugu News