Chittoor District: ఆదివారం రాత్రి ఘనంగా వివాహం... సోమవారం ఉదయం గుండెపోటుతో టెక్కీ మృతి!

  • చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఘటన
  • ఆసుపత్రికి తీసుకెళ్లేలోగానే పోయిన ప్రాణాలు
  • నవవరుడి మృతితో రెండు కుటుంబాలలో విషాదం 

తనకు వివాహమైన ఆనందం 24 గంటలైనా లేకుండా ఆ దేవుడు శిక్షించాడని విలపిస్తున్న ఆ నవ వధువును ఓదార్చడం ఇప్పుడు ఎవరి తరమూ కావడం లేదు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఆదివారం రాత్రి వైభవంగా వివాహం కాగా, సోమవారం ఉదయం 9 గంటలకు వరుడు గుండెపోటుతో మరణించడం రెండు కుటుంబాలకు తీరని శోకాన్ని మిగిల్చింది.

బెంగళూరులోని ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న మోహీన్ బాషా (28)కు మదనపల్లికే చెందిన యువతితో వివాహం జరిగింది. రాత్రి 12 గంటల వరకూ ఆనందంగా బంధుమిత్రులతో గడిపిన వారు, ఆపై ఇంటికి చేరుకున్నారు. ఉదయం బాషాకు గుండెల్లో నొప్పి రాగా, హుటాహుటిన అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ లోగానే అతని ప్రాణాలు పోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

More Telugu News