BCCI: కేఎల్‌ రాహుల్‌, మురళీ విజయ్‌, ఉమేశ్‌ యాదవ్‌ లపై వేటు... బాక్సింగ్ డే టెస్ట్ టీమ్ వివరాలు!

  • రేపటి నుంచి ఆస్ట్రేలియాతో మూడో టెస్టు
  • జట్టులోకి తిరిగి వచ్చిన రోహిత్, జడేజా
  • తొలి మ్యాచ్ ఆడనున్న మయాంక్ అగర్వాల్

మెల్‌ బోర్న్‌ వేదికగా రేపటి నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్టు కోసం భారత్ తుది జట్టును బీసీసీఐ ప్రకటించింది. తొలి రెండు టెస్టుల్లో విఫలమైన ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, మురళి విజయ్‌ లతో పాటు పేసర్ ఉమేశ్ యాదవ్ లను తప్పించిన బోర్టు, మయాంక్ అగర్వాల్ కు తుది జట్టులో స్థానం ఇచ్చింది.

ఇదే సమయంలో వెన్ను నొప్పితో రెండో టెస్టు ఆడని రోహిత్ శర్మ కూడా జట్టులోకి తిరిగి వచ్చాడు. స్పిన్నర్ రవీంద్ర జడేజా కూడా జట్టులోకి వచ్చేశాడు. నాలుగు టెస్టుల సిరీస్ లో ఇప్పటికే రెండు టెస్టులు పూర్తికాగా, ఇరు జట్లూ చెరో మ్యాచ్ గెలిచిన సంగతి తెలిసిందే. మూడో టెస్టులో విజయం సాధించడం ద్వారా సిరీస్ లో పైచేయి సాధించడమే లక్ష్యంగా ఆస్ట్రేలియా, ఇండియాలు వ్యూహాలు పన్నుతున్నాయి.

భారత జట్టు: విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), రహానే (వైస్‌ కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, హనుమ విహారి, చటేశ్వర పుజారా, రోహిత్‌ శర్మ, రిషభ్‌ పంత్‌, రవీంద్ర జడేజా, మహ్మద్‌ షమీ, ఇషాంత్‌ శర్మ, జస్ ప్రీత్ బుమ్రా.

More Telugu News