Chandrababu: డబ్బు సంపాదించడమే కాదు.. ఆనందంగా జీవించడం కూడా అంతే ముఖ్యం: చంద్రబాబు

  • హ్యాపీనెస్ ఇండెక్స్ లో మనమే నెంబర్ వన్
  • విద్యుత్ ఛార్జీలను పెంచేది లేదని దేశంలో తొలిసారి చెప్పింది మనమే
  • సీమ ఎడారిగా మారుతుందనే భయం నుంచి బయటపడ్డాం

హ్యాపీనెస్ ఇండెక్స్ ను కొలమానంగా తీసుకున్నామని, ప్రజలు హ్యాపీ సండే పేరుతో వారాంతాలలో సంతోషంగా గడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో... ఆనందంగా జీవించడం కూడా అంతే ముఖ్యమని అన్నారు. హ్యాపీనెస్ ఇండెక్స్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లలో నెంబర్ వన్ గా నిలిచామని చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పన, పర్యావరణం, విద్య, సాంకేతికత, వ్యవసాయ రంగాల్లో ఏపీకి జాతీయ స్థాయి పురస్కారాలు వచ్చాయని తెలిపారు. భూధార్ వ్యవస్థ ద్వారా భూ క్రయవిక్రయాల్లో అవకతవకలు లేకుండా చేస్తున్నామని చెప్పారు. ఈరోజు చంద్రబాబు రెండో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ మేరకు వ్యాఖ్యానించారు.

విద్యుత్ ఛార్జీలను పెంచేది లేదని దేశంలో తొలిసారి చెప్పింది మనమేనని చంద్రబాబు అన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయగలిగామని చెప్పారు. పౌల్ట్రీ, డెయిరీ, హార్టికల్చర్ వైపు దృష్టి సారించామని తెలిపారు. రాయలసీమ ఎడారిగా మారుతుందనే భయం నుంచి బయటపడ్డామని చెప్పారు. నదుల అనుసంధానం, జల సంరక్షణ విధానాలను అమలు చేశామని తెలిపారు. డ్రోన్ టెక్నాలజీని వినియోగించుకుని పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేశామని చెప్పారు.

రాష్ట్రానికి రావాల్సిన అన్ని విషయాల్లో కేంద్రం అడ్డుపడిందని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిని వైసీపీ జీర్ణించుకోలేకపోతోందని చెప్పారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపనకు ముహూర్తాన్ని ప్రకటించినా, అవహేళన చేస్తున్నారని విమర్శించారు.

More Telugu News