Tamilnadu: ప్రేయసి వంచించిందని మద్యంలో విషం కలుపుకుని తాగిన తమ్ముడు... మిగిలిన మద్యాన్ని తాగిన అన్న!

  • తమిళనాడులోని తూత్తుక్కుడిలో ఘటన
  • మద్యంలో విషం తాగి అపస్మారక స్థితిలోకి తమ్ముడు
  • విషయం తెలియక అదే మద్యం తాగిన అన్న
  • ఇరువురి మృతితో విషాదం 

తన ప్రేయసి దూరమైందన్న మనోవేదనతో ఓ యువకుడు మద్యంలో విషం కలిపి దాన్ని తాగగా, ఆ విషయం తెలియని అతని అన్న మిగిలి వున్న మద్యాన్ని తాగి మరణించిన విషాద ఘటన తమిళనాడు, తూత్తుక్కుడి సమీపంలో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల మేరకు, ఇక్కడి మణినగర్‌ పుదూర్‌ లో రాజా, విజయ్‌ సోదరులు. రాజాకు ఐదు నెలల క్రితం వివాహమైంది.  అతని తమ్ముడు విజయ్ కి చెన్నైలో పనిచేస్తున్న ఓ యువతితో పరిచయం ఏర్పడగా, అది ప్రేమగా మారింది.

ఆపై ఏం జరిగిందో ఏమో... ఆ యువతి విజయ్ ని దూరం పెట్టసాగింది. తన ప్రేమ విఫలమైందన్న వేదనలో ఉన్న విజయ్‌, ఓ మద్యం బాటిల్‌ తెచ్చుకుని, అందులో విషం కలిపి తాగాడు. ఆపై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన రాజా, మద్యంలో విషం కలిపున్న సంగతి తెలియక, దాన్ని తాగేసి, ఆపై నోట్లో నుంచి నురగలు కక్కుతూ కేకలు పెట్టాడు. దీంతో స్థానికులు వారిద్దరినీ ఆసుప్రతికి తరలించేలోగానే, ఇరువురూ ప్రాణాలు వదిలారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.

More Telugu News