Chandrababu: వర్మా... నిన్ను తరిమి తరిమి కొడతారు: కృష్ణా జిల్లా టీడీపీ నేత హెచ్చరిక

  • చంద్రబాబునాయుడిని కించపరిచేలా పాట
  • వెంటనే తొలగించకుంటే రోడ్డుపై తిరగనివ్వబోము
  • కృష్ణా జిల్లా టీడీపీ కార్యదర్శి మురళి హెచ్చరిక

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కించపరిచేలా దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ విడుదల చేసిన పాటను వెంటనే తొలగించకుంటే, ప్రజలు తరిమి తరిమి కొడతారని కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వీరవల్లి మురళి హెచ్చరించారు. 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమాలో అభ్యంతరకరమైన సన్నివేశాలను, పాటను, సీన్లను తక్షణం తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన పత్రికలకు ఓ ప్రకటనను విడుదల చేశారు.

పబ్లిసిటీ కోసం ప్రతిపక్షాలకు అమ్ముడుపోయిన వర్మ, బాధ్యత గల చంద్రబాబును అవమానించేలా, సినిమాలో సన్నివేశాలను, పాటలను తయారు చేసినట్టు కనిపిస్తోందని అన్నారు. దీన్ని ప్రజలు చూస్తూ ఊరుకోబోరని, రాష్ట్రాభివృద్దికి చంద్రబాబు చేస్తున్న కృషి ప్రజలందరికీ తెలుసునని అన్నారు. ఎన్టీఆర్‌ ను, చంద్రబాబును చులకన చేసేలా సినిమా తీస్తున్నట్టు తెలుస్తోందని, పిచ్చి పట్టిన వర్మను వెంటనే ఆసుపత్రిలో చేర్పించి మానసిక వైద్యం చేయించాలని అన్నారు. యూట్యూబ్‌ లో విడుదల చేసిన పాటపై రామ్ గోపాల్ వర్మ తెలుగు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ పాటను తొలగించకుంటే, వర్మను రోడ్డు మీద తిరగనివ్వబోమని అన్నారు.

More Telugu News