Sabarimala: సన్నిధానానికి కిలోమీటర్ దూరంలో ఇద్దరు అతివలు... అదనపు బలగాల కోసం పోలీసుల ఎదురుచూపు!

  • ఈ ఉదయం పంబ నుంచి బయలుదేరిన మహిళలు
  • భక్తుల నిరసనల మధ్యే ఆలయం సమీపంలోకి
  • భక్తుల నిరసనలతో ఉద్రిక్తత

50 సంవత్సరాలలోపు వయసున్న ఇద్దరు మహిళలు, శబరిమలకు బయలుదేరి, పంబ దాటి, సన్నిధానానికి కిలోమీటర్ దూరం వరకూ వెళ్లడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పెద్దఎత్తున భక్తులు వారిని అడ్డుకుని, రహదారిపైనే కూర్చుని శరణుఘోషను ప్రారంభించగా, పోలీసులు, అదనపు బలగాల కోసం వేచి చూస్తున్నారు. వీరిద్దరూ పంబకు వచ్చిన తరువాత, భక్తుల నిరసనల మధ్యే, పోలీసుల సహకారంతో కొండ ఎక్కడం ప్రారంభించారు. ఆపై కొంతదూరం వెళ్లే సరికి మహిళల రాక గురించి సమాచారం తెలిసిపోగా, వేలాది మంది భక్తులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.

దీంతో అదనపు బలగాలు వచ్చిన తరువాత, వీరిని ఆలయంలోకి అనుమతించే విషయమై నిర్ణయం తీసుకుంటామని అధికారులు అంటున్నారు. కాగా, ఆదివారం నాడు 11 మంది మహిళలు స్వామి దర్శనానికి రాగా, వారిని కూడా భక్తులు అడ్డుకున్నారు. శబరిమలకు ఎవరైనా వెళ్లవచ్చని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తరువాత, ఇంతవరకూ 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న ఏ మహిళ కూడా స్వామిని దర్శించుకోలేదు.

More Telugu News