Hyderabad: ముగ్గురు విద్యార్థుల ప్రాణాలను మింగిన సెల్ఫీ మోజు.. హైదరాబాద్‌లో తీరని విషాదం

  • సెల్ఫీ తీసుకుంటూ కాలు జారి నీటి గుంతలో పడిన అన్న
  • రక్షించేందుకు దూకిన తమ్ముడు
  • ఇద్దరినీ కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన  స్నేహితుడు

సెల్ఫీ మోజు ముగ్గురి ప్రాణాలను బలిగొంది. హైదరాబాద్ శివారులోని కొత్వాల్‌గూడ వద్ద జరిగిన ఈ ఘటన రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని మోతీనగర్‌కు చెందిన సూర్య (22) భోపాల్‌‌లో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. అతని సోదరుడు చంద్ర (18) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో  ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సెలవుల నేపథ్యంలో ఇంటికి వచ్చిన సూర్య, సోదరుడు చంద్ర, అతడి స్నేహితులతో కలిసి ఆదివారం హిమాయత్‌ జలాశయం వద్దకు ద్విచక్ర వాహనాలపై వెళ్లారు.

ఇటీవల వచ్చిన బాహుబలి సినిమా షూటింగ్ జరిగిన గుంతల వద్దకు వెళ్లి ఈత కొట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సెల్ఫీ తీసుకుంటున్న సూర్య ప్రమాదవశాత్తు కాలుజారి నీటి గుంతలో పడి మునిగిపోయాడు. వెంటనే అప్రమత్తమైన తమ్ముడు చంద్ర అన్నను రక్షించేందుకు నీటి గుంతలోకి దూకాడు. అతడు కూడా మునిగిపోతుండడంతో స్నేహితుడు భార్గవ్ నీటిలోకి దూకి రక్షించే ప్రయత్నం చేశాడు. ఒకరిని ఒకరు రక్షించే ప్రయత్నంలో ముగ్గురూ మృతి చెందారు.

 ఇది చూసి ఒడ్డున ఉన్న స్నేహితులు భయంతో వణికిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు. కుమారుల మృతదేహాలను చూసిన తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

More Telugu News