Telangana: తెలంగాణలో మరో పరువు హత్య.. కుమార్తెను చంపి, అస్థికలను కాలువలో కలిపిన తల్లిదండ్రులు!

  • జగిత్యాలలోని కలమడుగులో దారుణం
  • మరో కులంవాడిని పెళ్లాడిన యువతి
  • కేసు నమోదు చేసిన పోలీసులు

తెలంగాణలోని మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా అంతకుమించిన దారుణం మరొకటి చోటుచేసుకుంది. తక్కువ కులానికి చెందిన యువకుడిని తమ కుమార్తె పెళ్లి చేసుకోవడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు యువతిని ప్రాణాలు పోయేవరకూ కొట్టిచంపారు. అనంతరం ఆమె మృతదేహం పోలీసులకు దొరక్కుండా దహనం చేసి అస్థికలను సమీపంలోని కాలువలో కలిపేశారు. ఈ దారుణ ఘటన తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని జన్నారం మండలం కలమడుగుకు చెందిన అనురాధ, మరో కులానికి చెందిన లక్ష్మణ్ ను ప్రేమించింది. అయితే ఇందుకు అమ్మాయి ఇంట్లోవాళ్లు ఒప్పుకోకపోవడంతో వీరిద్దరూ హైదరాబాద్ లోని ఆర్య సమాజ్ లో ఈ నెల 3న వివాహం చేసుకున్నారు. దీంతో అనురాధ తల్లిదండ్రులు ఈ జంటపై పగ పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో అనురాధ దంపతులు నాలుగు రోజుల క్రితం సొంతూరికి చేరుకున్నారు.

దీంతో ప్రేమగా కుమార్తెను ఇంటికి పిలిపించుకున్న తల్లిదండ్రులు, సోదరుడు మహేశ్ అనురాధను విచక్షణారహితంగా చావగొట్టారు. దీంతో దెబ్బలు తాళలేక ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు మృతదేహం పోలీసులకు దొరక్కుండా పొలంలో దహనం చేశారు. అనంతరం అవశేషాలు కూడా లభ్యం కాకుండా పక్కనే ఉన్న కాలువలో కలిపేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News