Telangana: అక్రమ సంబంధం ఎఫెక్ట్.. ప్రియుడి కోసం భర్తను కిరాతకంగా హతమార్చిన భార్య!

  • అనంతరం ప్రియుడితో కలిసి పరారీ
  • రెండు నెలల పాటు పోలీసుల గాలింపు
  • కటకటాల వెనక్కు నెట్టిన పోలీసులు 

వివాహబంధాన్ని అపహాస్యం చేసేలా ఓ మహిళ వ్యవహరించింది. ప్రియుడి మోజులో పడి సొంత భర్తనే కిరాతకంగా హత్య చేసింది. అనంతరం ప్రియుడితో కలిసి పరారయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు నెలల పాటు గాలించి నిందితులను కటకటాల వెనక్కు నెట్టారు. ఈ ఘటన హైదరాబాదు శివారు నాచారంలో చోటుచేసుకుంది.

కామారెడ్డి జిల్లా జుక్కల్‌ మండలం పెద్దఇడిగా గ్రామానికి చెందిన జనగాం వీరయ్య(47), భాగ్యశ్రీ(32) దంపతులు నాచారంలో ఉంటున్నారు. వీరయ్య డీసీఎం డ్రైవర్ గా పనిచేస్తుండగా, భార్య అక్కడే ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడే పనిచేస్తున్న రానాతో భాగ్యశ్రీకి అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న వీరయ్య ప్రవర్తన మార్చుకోవాలని భార్యను హెచ్చరించాడు.

అయితే తీరు మార్చుకోని ఆమె ప్రియుడితో కలిసి భర్తను చంపేయాలని నిర్ణయించుకుంది.  ఈ ఏడాది అక్టోబర్ 10న మద్యం తాగి ఇంటికి వచ్చిన వీరయ్య భార్యతో గొడవపడ్డాడు. దీంతో వీరయ్య నిద్రపోయాక భాగ్యశ్రీ తన ప్రియుడు రానాను పిలిచింది. ఇద్దరూ కలసి అతని నెత్తిపై రోకలిబండతో మోది హత్య చేశారు. అనంతరం ప్రియుడు రానాతో కలిసి ఆమె పరారయింది.

రెండ్రోజుల తర్వాత ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగన అధికారులు కుళ్లిపోయిన స్థితిలో వీరయ్య మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. హత్యగా కేసు నమోదుచేసిన పోలీసులు రెండు నెలల పాటు నిందితుల కోసం గాలించారు. ఈ క్రమంలో భాగ్యశ్రీ, రానా మల్లాపూర్ లోనే ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు.

More Telugu News