TRS: ఈ ఎన్నికలు చరిత్ర పుటల్లో నిలిచిపోతాయి: హరీశ్ రావు

  • సిద్ధిపేట ప్రజలు అద్భుత మెజార్టీతో గెలిపించారు
  • ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటా
  • పంచాయతీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ను గెలిపించాలి

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు చరిత్ర పుటల్లో నిలిచిపోతాయని టీఆర్ఎస్ అగ్రనేత హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేటలో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల కృతఙ్ఞత సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ, గతంలో పలు నియోజకవర్గాల్లో తాను పని చేసినా, అద్భుత మెజార్టీతో తనను ఇక్కడి ప్రజలు గెలిపించారని, వారికి తన ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.

ప్రతి కార్యకర్తను తన కంటికి రెప్పలా కాపాడుకుంటానని, ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తానని చెప్పారు. త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ ను గెలిపించాలని, వీలైనన్ని గ్రామాలను ఏకగ్రీవం చేసుకుందామని అన్నారు. సిద్ధిపేట జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పలువురు మెచ్చుకుంటున్నారని, ఇక్కడి పల్లెల్లో అభివృద్ధిని చూసేందుకు వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. 

More Telugu News