modi: మోదీ ఉప్పు తిన్న కేసీఆర్ ఆయన రుణం తీర్చుకోవడానికే ఢిల్లీ పర్యటనలు: సీపీఐ నేత నారాయణ

  • ప్రధాని మోదీకి కేసీఆర్ పొలిటికల్ సెక్రటరీ
  • మోదీ సహకారంతోనే ఈ ఎన్నికల్లో కేసీఆర్ గెలిచారు
  • అక్రమాలకు పాల్పడ్డ టీఆర్ఎస్ కు ఈసీ మద్దతిచ్చింది

తెలంగాణ సీఎం కేసీఆర్ పై సీపీఐ నేత నారాయణ ఓ రేంజ్ లో విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని మోదీకి కేసీఆర్ పొలిటికల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కేసీఆర్, మోదీ ఉప్పు తిన్నారు కనుకనే, ఆయన రుణం తీర్చుకునేందుకు తరచుగా ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు.

 ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయంపైనా ఆయన వ్యాఖ్యలు చేశారు. మోదీ సహకారంతోనే ఈ ఎన్నికల్లో కేసీఆర్ గెలిచారని ఆరోపించారు. ఓటర్లకు టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంపిణీ చేస్తుంటే ఎన్నికల సంఘం మద్దతుగా నిలిచిందని ఆరోపించారు. అధికారపార్టీ నేతలు డబ్బు పంపిణీ చేస్తుంటే పోలీసులు కాపలా కాశారని ఆరోపణలు చేశారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారం గురించి నారాయణ ప్రస్తావిస్తూ, ఇది రాజకీయ వ్యభిచారంతో సమానమని, ఇది అప్రజాస్వామికమని అభిప్రాయపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను కేసీఆర్ తన ఫామ్ హౌస్ లోనే నడపబోతున్నారని సెటైర్లు విసిరారు. 

More Telugu News