rgv: కర్నూలుకు వస్తా.. టీడీపీ ఎమ్మెల్యేపై పోలీసులకు నేనూ ఫిర్యాదు చేస్తా!: రామ్ గోపాల్ వర్మ

  • వర్మపై ఎస్వీ మోహన్ రెడ్డి ఫిర్యాదు
  • చంద్రబాబును అనుచితంగా చూపారని ఆవేదన
  • కౌంటర్ గా ఫిర్యాదు చేస్తానన్న వర్మ

దివంగత ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలను నిర్మిస్తుంటే, మరోవైపు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరుతో పోటీగా ఇంకో సినిమా తీస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ‘వెన్నుపోటు’ అనే పాటను వర్మ నిన్న రిలీజ్ చేయడంతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వర్మపై ఏపీలో పలుచోట్ల టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కర్నూలుకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి సైతం రాంగోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రబాబును ఈ పాటలో అనుచితంగా చూపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ సైతం స్పందించారు. కర్నూలు ఎమ్మెల్యే, టీడీపీ నేత మోహన్ రెడ్డిపై తాను కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ట్వీట్ చేశారు. ఇందుకోసం కర్నూలుకు వస్తానని ప్రకటించారు. మోహన్ రెడ్డి ఫిర్యాదు కాపీని ఈ ట్వీట్ కు వర్మ జతచేశారు.

More Telugu News