rafale deal: రాఫెల్ డీల్ వ్యవహారంలో మోదీని పారికర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు: జైపాల్ రెడ్డి

  • రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు రాఫెల్ సమాచారాన్ని దగ్గర పెట్టుకున్నారు
  • సీఎం పదవిని కాపాడుకోవడానికి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు
  • పారికర్ అస్వస్థత కారణంగా గోవాలో పాలన స్తంభించింది

రాఫెల్ డీల్ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని ప్రధాని మోదీని గోవా ముఖ్యమంత్రి పారికర్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రక్షణ మంత్రిగా పని చేసిన పారికర్ రాఫెల్ కు సంబంధించిన సమాచారాన్ని తన వద్ద ఉంచుకున్నారని... దీన్ని అస్త్రంగా వాడుతూ, సీఎం పదవిని కాపాడుకునేందుకు మోదీపై బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నారని అన్నారు. గోవాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ జైపాల్ రెడ్డి ఈ మేరకు స్పందించారు.

పారికర్ అస్వస్థత కారణంగా గోవా రాష్ట్రంలో పాలన స్తంభించిందని... సీఎం పీఠాన్ని ఆయన జలగలా పట్టుకుని వేలాడుతున్నారని జైపాల్ రెడ్డి విమర్శించారు. సీఎం పదవికి ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు జైపాల్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. రాఫెల్ ఒప్పందంపై మోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని... ఈ అంశాన్ని మళ్లీ వివాదాస్పదం చేసేందుకే కాంగ్రెస్ ఈ ఆరోపణలు చేస్తోందని విమర్శించారు.

More Telugu News