hotel: ‘కేసు నమోదు చేయాలంటే హోటల్ గదికి రావాలి’ అన్న తుళ్లూరు సీఐ!

  • ఏపీలోని గుంటూరు జిల్లాలో ఘటన
  • మహిళను ట్రాప్ చేసిన తుళ్లూరు సీఐ
  • రెండోసారి సస్పెండ్ చేసిన అధికారులు

గుంటూరులో ఓ పోలీస్ అధికారి తన వృత్తికే మచ్చ తెచ్చాడు. మహిళను వేధించిన ఘటనలో ఓసారి సస్పెండ్ అయినప్పటికీ బుద్ధి మార్చుకోకుండా మరోసారీ అదే పనికి దిగాడు. దీనిపై రహస్య విచారణ జరిపిన అధికారులు సదరు ప్రబుద్ధుడిని సస్పెండ్ చేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని తెనాలి కంట్రోల్ రూమ్ అధికారిగా ఉన్న రమేశ్ ఇటీవల తూళ్లూరు పోలీస్ స్టేషన్ ఇన్ చార్జీగా బాధ్యతలు స్వీకరించాడు. ఈ క్రమంలో ఓ మహిళ ఫిర్యాదు చేసేందుకు తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు వచ్చింది. దీంతో సీఐ హోదాలో ఉన్న రమేశ్ తాను పోలీసధికారినన్న సంగతి మర్చిపోయాడు. నిబంధనల మేరకు బాధితురాలి ఫిర్యాదును సీసీటీఎన్‌ఎస్‌కు అనుసంధానం చేయడంతో పాటు ఎలక్ట్రానిక్ రసీదును ఇవ్వాల్సి ఉంటుంది. కానీ రమేశ్ మాత్రం ఈ ఘటనలో కేసు నమోదు చేయాలంటే హోటల్ గదికి రావాలని సూచించాడు.

ఈ నేపథ్యంలో ఆమె తూళ్లూరులోని సీఐ ఉంటున్న హోటల్ గదికి వెళ్లింది. ఈ వ్యవహారంపై గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు అందడంతో ఆయన రహస్యంగా విచారణ జరిపించారు. సదరు హోటల్ లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అనంతరం ఈ వ్యవహారంపై  ఐజీ గోపాలరావుకు నివేదిక సమర్పించారు. దీంతో సీఐ రమేశ్ ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. గతంలో శావల్యాపురంలో ఎస్‌ఐగా పని చేస్తున్న సమయంలో కుటుంబ కలహాల నేపథ్యంలో స్టేషన్ కు వచ్చిన ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో రమేశ్ సస్పెండ్ అయ్యాడు. 

More Telugu News