Jammu And Kashmir: జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులకు చావుదెబ్బ.. ఆరుగురు టెర్రరిస్టులను కాల్చిచంపిన ఆర్మీ!

  • పూల్వామా జిల్లా త్రాల్ లో ఎన్ కౌంటర్
  • కాల్పులు జరుపుతూ పరారైన ఉగ్రవాదులు
  • ఇంకా కొనసాగుతున్న ఎన్ కౌంటర్

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులను భద్రతాబలగాలు చావుదెబ్బ తీశాయి. పూల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతంలో ఈరోజు జరిగిన ఎన్ కౌంటర్ లో ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. పూల్వామాలోని త్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు భద్రతాబలగాలకు నిఘావర్గాల నుంచి పక్కా సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన సీఆర్పీఎఫ్, ఆర్మీ, పోలీసుల సంయుక్త బలగాలు త్రాల్ లో ఉగ్రవాదులు నక్కిన ఇంటిని చుట్టుముట్టాయి.

అయితే బలగాల కదలికలను పసిగట్టిన ఉగ్రవాదులు, కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమయిన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఆరుగురు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. మరోవైపు ఘటనాస్థలం నుంచి తప్పించుకున్న ఉగ్రవాదులు, భద్రతాబలగాల మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.

ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ఉగ్రవాదులు నక్కిన ఇంటి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మిగిలిన ఉగ్రవాదులను ఏరివేసేందుకు ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నారు.

More Telugu News