Congress: తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్.. ‘కారు’ ఎక్కేందుకు సిద్ధమైన ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్

  • కేసీఆర్‌ను కలిసి అభినందించిన ఎమ్మెల్సీలు
  • సీఎంతో గంటపాటు భేటీ
  • కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారిన లలిత, సంతోష్ వ్యవహారం

తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్‌కు మరో షాకింగ్ న్యూస్. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆకుల లలిత, సంతోష్‌లు గురువారం రాత్రి ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. దాదాపు గంటపాటు వీరు భేటీ అయినట్టు తెలుస్తోంది. దీంతో త్వరలోనే వీరు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది.

కేసీఆర్ ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆయనను అభినందించేందుకే ప్రగతి భవన్‌కు వెళ్లినట్టు లలిత అనుచరులు చెబుతున్నప్పటికీ పార్టీ మారడానికి ఆమె సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఇటీవల జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన లలిత టీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.

ఇక, కరీంనగర్‌కు చెందిన మరో నేత సంతోష్ జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో  కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్‌తో కలిసి ఆయన ప్రగతి భవన్‌కు వచ్చారు. కేసీఆర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించి అభినందించారు. ఆకుల లలిత, సంతోష్ వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది.

More Telugu News