Karnataka: 682 మందికి లింగమార్పిడి చేసిన మహిళా డాక్టర్... కర్ణాటకలో సెక్స్ చేంజ్ కుంభకోణంతో తీవ్ర కలకలం!

  • ఒక్కో ఆపరేషన్ కు రూ. 1.25 లక్షలు
  • పోలీసులు ప్రశ్నిస్తుంటే స్పృహ కోల్పోయిన లేడీ డాక్టర్
  • కేసును లోతుగా విచారిస్తున్నామన్న పోలీసులు

గడచిన మూడేళ్ల వ్యవధిలో ఓ హిజ్రా తన వద్దకు తీసుకువచ్చిన 682 మంది బాలురకు లింగమార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించిందో బెంగళూరు లేడీ డాక్టర్. ఈ సెక్స్ మార్పిడి కుంభకోణం ఇప్పుడు కర్ణాటకలో తీవ్ర కలకలం రేపుతుండగా, పోలీసులు రంగంలోకి దిగారు.

మాండ్యా పోలీసుల కథనం ప్రకారం, ఈ శస్త్రచికిత్సల కుంభకోణం ఇటీవలే వెలుగులోకి వచ్చింది. పోలీసులు మహిళా డాక్టర్ ను విచారిస్తుండగా, ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చికిత్స చేయిస్తున్నారు. ఆమెకు సహకరించిన వారిని, ఆమె వద్దకు బాలురను తీసుకు వెళ్లే హిజ్రా కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

తమ ప్రాథమిక విచారణలో లేడీ డాక్టర్ 682 ఆపరేషన్లు చేసిందని, ఒక్కో ఆపరేషన్ కు ఆమె రూ. 1.25 లక్షలు తీసుకున్నట్టు తేలిందని మాండ్యా ఎస్పీ శివ ప్రకాశ్ దేవరాజు వెల్లడించారు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మాండ్యాకు చెందిన ఓ మహిళ, తన 16 ఏళ్ల మనవడు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేయగా, అక్టోబర్ లో పట్టణంలోని కేఆర్ పేట సర్కిల్ లో అమ్మాయిగా వేషం మార్చిన అతన్ని కొందరు గుర్తించి పోలీసులకు, కుటుంబానికీ సమాచారం ఇచ్చారు.

అతన్ని విచారించగా, ఈ లింగమార్పిడి కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కొందరు హిజ్రాలు తనకు బాగా డబ్బులు వస్తాయని చెప్పి లింగమార్పిడి శస్త్రచికిత్సకు ఒప్పించారని పోలీసులకు తెలిపాడు. ఈ కేసు తీవ్రత దృష్ట్యా మరింత లోతుగా విచారిస్తున్నామని అధికారులు వెల్లడించారు.

More Telugu News