Maharashtra: దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ భార్య ట్వీట్‌తో స్పందించిన మహారాష్ట్ర ప్రభుత్వం.. రంగంలోకి పోలీసులు

  • ల్యాండ్ మాఫియా నుంచి దిలీప్ కుమార్‌ భార్యకు బెదిరింపులు
  • ప్రధాని అపాయింట్‌మెంట్ కోసం వేడుకోలు
  • సీఎంవో జోక్యంతో రంగంలోకి పోలీసులు

ల్యాండ్ మాఫియా నుంచి తమకు వేధింపులు ఎదురవుతున్నాయని, ఈ విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరుతూ బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ భార్య సైరాబాను మూడు రోజుల క్రితం ప్రధాని కార్యాలయానికి ట్వీట్ చేశారు. దిలీప్ కుమార్ బంగ్లాలోని రెండు ప్లాట్లను కొట్టేయడానికి సమీర్ భోజ్వానీ ప్లాన్ చేస్తున్నాడని, ఈ క్రమంలో బెదిరింపులకు దిగుతున్నాడని అందులో ఆరోపించారు. గతంలో సైరాబాను ఫిర్యాదుపై అరెస్ట్ అయిన ల్యాండ్ మాఫియా, బిల్డర్ సమీర్ భోజ్వానీ ఇటీవల విడుదలయ్యాడు.

సమీర్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తమను బెదిరిస్తున్నాడని, ఈ విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలని కోరుతూ సైరాబాను ట్వీట్ చేశారు. ప్రధాని అపాయింట్‌మెంట్ ఇప్పించాల్సిందిగా వేడుకున్నారు. ఈ విషయంలో తమకు న్యాయం చేస్తామన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సైరాబాను ట్వీట్‌తో తాజాగా ఫడ్నవిస్ ప్రభుత్వం స్పందించింది. ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యంతో పోలీసులు మరోమారు రంగంలోకి దిగారు. సమీర్ భోజ్వానీ బెయిలును రద్దు చేయాలని కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు.

More Telugu News