governor: ముఖేష్ అంబానీపై తీవ్ర విమర్శలు గుప్పించిన జమ్ముకశ్మీర్ గవర్నర్

  • కుమార్తె పెళ్లి కోసం రూ. 700 కోట్లు ఖర్చు చేశారు
  • దేశం కోసం ఖర్చు చేయడానికి మాత్రం చేతులు రావు
  • ఆ డబ్బుతో జమ్ముకశ్మీర్ లో 700 పాఠశాలలు ప్రారంభించవచ్చు

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీపై జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన కుమార్తె పెళ్లి కోసం రూ. 700 కోట్లను ఖర్చు చేశారని... దాతృత్వ విరాళం కోసం మాత్రం ఆ స్థాయిలో ఆయనకు చేతులు రావడం లేదని విమర్శించారు. జమ్ములో ఈరోజు జరిగిన ఫ్లాగ్ డే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖేష్ పేరును నేరుగా ప్రస్తావించకుండా విమర్శించారు.

దేశంలోనే అత్యంత ధనవంతుడైన ఒక వ్యక్తి తన కుమార్తె పెళ్లి కోసం రూ. 700 కోట్లు ఖర్చు చేశారని ఈ సందర్భంగా సత్యపాల్ విమర్శించారు. ఛారిటీ కోసం కానీ, దేశం కోసం కానీ ఖర్చు చేసేందుకు మాత్రం ఆయనకు చేతులు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. పెళ్లి కోసం ఆయన చేసిన ఖర్చుతో జమ్ముకశ్మీర్ లో 700 పాఠశాలలను ప్రారంభించవచ్చని చెప్పారు. 7 వేల మంది అమర జవాన్ల పిల్లలను పెంచేందుకు వారి భార్యలకు ఆర్థిక సాయం చేసేందుకు సరిపోతుందని అన్నారు.

ఇదే సమయంలో జమ్ముకశ్మీర్ నేతలు, ఉన్నతాధికారులపై కూడా ఆయన విరుచుకుపడ్డారు. వీరంతా రోజురోజుకూ సంపద పెంచుకుంటున్నారని... సమాజానికి ఒక్క చిల్లిగవ్వ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. 

More Telugu News