Karnataka: తల్లిదండ్రుల కళ్లముందే ప్రాణాలు కోల్పోయిన టెక్కీ.. రైలు నుంచి దిగుతుండగా దారుణం!

  • కర్ణాటకలోని కర్మేలారంలో ఘటన
  • తల్లిదండ్రులను రైలు ఎక్కించిన యువకుడు
  • ప్రమాదంలో టెక్కీ తండ్రికి తీవ్రగాయాలు

తల్లిదండ్రులను సాగనంపేందుకు రైల్వేస్టేషన్ కు వచ్చిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్, వాళ్ల కళ్లముందే విగతజీవిగా మారాడు. కదులుతున్న రైలు నుంచి దిగే క్రమంలో కింద పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడు కింద పడటాన్ని చూసిన తండ్రి తాను రైలు దిగబోయి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.

కేరళలోని పాలక్కాడ్ జిల్లా కంజికోడే గ్రామానికి చెందిన విక్రమ్ విజయన్(28) బెంగళూరులోని విప్రో కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో కుమారుడిని చూసేందుకు తల్లిదండ్రులు విజయన్, ఉదయకుమారి బెంగళూరుకు వచ్చారు. కుమారుడితో కొద్దిరోజులు గడిపిన అనంతరం కేరళకు తిరుగుప్రయాణం అయ్యారు. ఈ నేపథ్యంలో కర్మేలారం రైల్వే స్టేషనులో తల్లిదండ్రులను విక్రమ్ రైలు ఎక్కించాడు.

చివరికి రైలు కదలబోతుండగా దిగేందుకు విక్రమ్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో కింద పడ్డ విక్రమ్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు కుమారుడు పడిపోవడాన్ని గమనించిన విజయన్ తానూ రైలు దిగబోయి తీవ్రంగా గాయపడ్డాడు.  

More Telugu News