maddela cheruvu suri: భాను కిరణ్ కు యావజ్జీవ శిక్ష పడాలి.. ఉరిశిక్ష పడితే ఇంకా హ్యాపీ: సూరి భార్య గంగుల భానుమతి

  • భాను కిరణ్ కు శిక్ష పడుతుందన్న నమ్మకం ఉంది
  • టెక్నికల్ గా బాగా ప్లాన్ చేసి సూరిని హతమార్చాడు
  • పరిటాల వాళ్లతో కచ్చితంగా కుమ్మక్కయ్యాడు

ఫ్యాక్షనిస్టు మద్దెల చెరువు సూరి  ఏడేళ్ల క్రితం  తన అనుచరుడు భాను కిరణ్ చేతిలో హత్యకు గురైన కేసులో తుది తీర్పు రేపు వెలువడనుంది. ఈ నేపథ్యంలో సూరి భార్య గంగుల భానుమతి విలేకరులతో మాట్లాడుతూ, ఈ కేసులో భాను కిరణ్ కు యావజ్జీవ శిక్ష పడాలి, ఉరిశిక్ష విధిస్తే ఇంకా హ్యాపీ అని అన్నారు. తమకు న్యాయం జరుగుతుందని, అతనికి శిక్ష పడుతుందన్న నమ్మకం తమకు ఉందని చెప్పారు.

 మన దగ్గరున్న ఉన్న వ్యక్తే మనల్ని చంపేస్తారని ఎవరూ అనుకోరని, సూరి తన వ్యవహారాల్లో చాలా బిజీగా ఉన్న సమయంలోనే భాను కిరణ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని అన్నారు. సూరితో ఎవరైనా మాట్లాడాలంటేనే భయపడతారని, ఆయనకు ముక్కుమీదే కోపం ఉంటుందని, ఆయనతో మాట్లాడే ధైర్యం కూడా భాను కిరణ్ కు లేదని, అలాంటిది తన భర్తను హతమార్చాడని అన్నారు. టెక్నికల్ గా బాగా ప్లాన్ చేశాడని, పరిటాల వాళ్లతో కచ్చితంగా కుమ్మక్కై భాను కిరణ్ ఈ పని చేశాడని ఆరోపించారు.

సూరిని తన ఇంట్లోనే చంపాలంటే చాలా మంది జనం ఉంటారు, ఆయన బయటకు వెళితే ఆయనతో పాటు రెండు మూడు వాహనాలు ఉంటాయి కనుక, చాలా ప్రీప్లాన్డ్ గా భాను కిరణ్ తన భర్తను హత్య చేశాడని అన్నారు. సూరి పేరును ఉపయోగించుకుని భాను కిరణ్ చాలా మందిని భయపెట్టి, సెటిల్ మెంట్స్ చేసి డబ్బులు, భూములు, హైదరాబాద్ లో ప్లాట్స్ సంపాదించుకున్నాడని చెప్పారు.

ఈ సందర్భంగా రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ, పరిటాల సునీతకు వ్యతిరేకంగా తమ రాజకీయ పోరు కొనసాగుతుందని, తమ శక్తి కొలది పోరాడతామని, రాప్తాడులో వైసీపీ జెండా ఎగురవేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News