suciede: ఒంటికి నిప్పంటించుకుని యువతి ఆత్మహత్య

  • ఫోన్‌ ఎక్కువగా మాట్లాడుతోందని  తల్లి మందలింపు
  • క్షణికావేశంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటిచుకున్నవైనం
  • ఘటనా స్థలిలోనే ప్రాణాలు కోల్పోయిన బాధితురాలు

తల్లి మందలించిందని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడుతుండడాన్ని గమనించిన తల్లి ఆగ్రహం వ్యక్తం చేయడంతో  ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రగాయాలు కావడంతో ఘటనా స్థలిలోనే మృతి చెందింది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొండకల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామానికి చెందిన శృతి (20) వట్టినాగులపల్లిలోని ఎస్‌ఎస్‌జే ఇంజనీరింగ్‌ కళాశాలలో ఈసీఈ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శృతి తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండడం, చాటింగ్‌ చేస్తుండడం ఆమె తల్లి పుణ్యవతి ఎప్పటి నుంచో గమనిస్తోంది. శుక్రవారం అదేపనిగా ఫోన్‌ ఉపయోగిస్తుండడంతో ఆగ్రహం తట్టుకోలేక చేతిలోనుంచి ఫోన్‌ లాక్కుంది.

దీంతో మనస్తాపానికి గురైన శృతి శనివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రగాయాలు కావడంతో ఘటనా స్థలిలోనే మృతి చెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఘటనా స్థలిని సందర్శించిన పోలీసులు కారణాలు అడిగి తెలుసుకున్నారు.

More Telugu News