defamation notice: సిద్ధుపై వెయ్యి కోట్లకు పరువునష్టం దావా వేసిన జీ న్యూస్

  • సిద్ధూ ర్యాలీలో పాక్ అనుకూల నినాదాలంటూ జీ న్యూస్ కథనం
  • పరువు నష్టం దావా వేస్తానన్న సిద్ధూ
  • సిద్ధూ పైనే కోర్టుకెక్కిన మీడియా సంస్థ

తమపై అసత్య ఆరోపణలు చేశారంటూ పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూపై జీ న్యూస్ వెయ్యి కోట్ల రూపాయలకు పరువునష్టం దావా వేసింది. జీ మీడియా గ్రూప్ పైనా, ఆ సంస్థ ఎడిటర్ ఇన్ చీఫ్‌పైనా అసత్య ఆరోపణలు చేసినందుకు 24 గంటల్లోగా బేషరతు క్షమాపణ చెప్పాలడి డిమాండ్ చేసింది. లేదంటే పరువు నష్టం కేసు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.  

 రాజస్థాన్‌లోని అల్వార్‌లో నిర్వహించిన ర్యాలీలో కొందరు పాకిస్థాన్ అనుకూల నినాదాలు చేసినట్టు జీ న్యూస్ ఓ కల్పిత వీడియోను ప్రసారం చేసిందని ఈనెల 3న సిద్ధూ ఆరోపించారు. ఆ చానల్‌పై పరువునష్టం దావా వేయనున్నట్టు హెచ్చరించారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని, తన లాయర్లను సంప్రదించిన అనంతరం నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.

దీనిపై స్పందించిన జీ న్యూస్ యాజమాన్యం సిద్ధు ఆరోపణలు కొట్టిపడేసింది. సిద్ధు వ్యాఖ్యలు చానల్ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయని నోటీసుల్లో పేర్కొంది. ఆ వీడియో అల్వార్ ర్యాలీకి సంబంధించినది కాదని, 2016లో ఢిల్లీలోని జేఎన్‌యూలో జరిగిన ఆందోళనకు సంబంధించినదని స్పష్టం చేసింది. నోటీసులు అందిన 24 గంటల్లోగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది.

More Telugu News