suciede: పెళ్లి చేసుకుంటామని మోసం.. 17 ఏళ్ల బాలిక ఆత్మహత్య!

  • పదిహేనేళ్లకే వివాహ నిశ్చయం
  • రెండేళ్లపాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగాక కాదన్న వరుడు
  • మనస్తాపంతో మూడంతస్తుల భవనంపై నుంచి దూకిన బాలిక

మోజుపడ్డామన్నారు... చిన్నపిల్ల అంటే ఇప్పుడు నిశ్చితార్థమే, మేజర్‌ అయ్యాకే పెళ్లి చేసుకుందామని నమ్మబలికారు. సరేనని తల్లి తలూపడంతో నిశ్చితార్థం జరిపించేశారు. కాబోయే భార్యతో రెండేళ్లపాటు చెట్టాపట్టాలేసుకుని తిరగడమేకాక ఎంతో దూరం వెళ్లిన వరుడు పెళ్లి సయమానికి నిరాకరించడంతో ఆ బాలిక హతాశురాలైంది. మనస్తాపంతో మూడంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలావున్నాయి.

హైదరాబాద్‌, బేగంబజార్‌ కోల్సావాడి ప్రాంతంలో కర్ణాటకకు చెందిన లక్ష్మీబాయి తన కుమార్తె మమత (17)తో నివాసం ఉంటోంది. భర్త చనిపోవడంతో లక్ష్మీబాయి అన్నీ తానై కూతుర్ని తొమ్మిదో తరగతి చదివిస్తోంది. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం కార్వాన్‌ హనుమాన్‌ గల్లీకి చెందిన ఆనంద్‌, అంబూబాయి దంపతులు మమతతో తమ కుమారుడు రాజేష్‌కు పెళ్లి విషయాన్ని ప్రస్తావించారు.

ఆమెకు ఇప్పుడు పదిహేనేళ్లేనని, ఇప్పుడే పెళ్లి తనకు ఇష్టం లేదని ఆమె తిరస్కరించింది. దీంతో తమ కుమారుడు మీ అమ్మాయి అంటే మోజుపడుతున్నాడని, ఇప్పుడు నిశ్చితార్థం చేసుకుందామని, మేజర్‌ అయ్యాక పెళ్లి చేసుకుందామని తమతోపాటు బంధువులతోనూ ఒత్తిడి తెచ్చారు. కూతురు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని లక్ష్మీబాయి సరేననడంతో వివాహ నిశ్చితార్థం జరిపించేశారు. ఆ తర్వాత రెండేళ్లపాటు మమతో రాజేష్‌ చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు.

ఈ క్రమంలో గురువారం రాత్రి హనుమాన్ గల్లీలోని వరుడి ఇంటికి సమీపంలో ఉన్న మూడంతస్తుల భవనంపై నుంచి మమత దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అంతకు ముందు ఆ రోజు మధ్యాహ్నం రాజేష్‌ తల్లిదండ్రులు మమత ఆత్మహత్యకు పాల్పడిన భవనంలోని ప్లాట్‌లో అద్దెకు ఉంటున్న ఆమె పెదనాన్న అర్జున్‌, పెద్దమ్మ గుండమ్మ ఇంటికి వెళ్లి తమ కుమారుడికి ఈ పెళ్లి ఇష్టం లేదని, ఈ విషయం లక్ష్మీబాయికి తెలియజేయాలని చెప్పారు.

ఇదే విషయాన్ని వారు లక్ష్మీబాయికి తెలిపి తమ ఇంటికి ఆమెతోపాటు మమతను రప్పించారు. రాజేష్‌ తల్లిదండ్రులను పిలిపించారు. అందరి సమక్షంలోనూ రాజేష్‌ తల్లిదండ్రులు తమ కుమారుడికి ఈ పెళ్లి ఇష్టం లేదని, అందుకే ఈ విషయం చెబుతున్నామని స్పష్టం చేశారు. దీంతో హతాశురాలైన లక్ష్మీబాయి, ఆమె బంధువులు ఇదేం అన్యాయమన్నారు.

నిశ్చితార్థమై, రెండేళ్లపాటు తిరిగిన జంటకు ఇప్పుడు పెళ్లి చేయకుంటే చూసిన వారు ఏమనుకుంటారని ప్రశ్నించారు. తన కుమార్తెకు వేరే సంబంధాలు ఎలా వస్తాయని, కావాలంటేే సంక్రాంతి తర్వాత పెళ్లి పెట్టుకుందామని ప్రాధేయపడింది. అయినా వారు ససేమిరా అన్నారు. ఈ చర్చంతా తన సమక్షంలో జరగడంతో విన్న మమత తీవ్ర మనస్తాపానికి గురైంది. పరుగున మేడపైకి వెళ్లి దూకేసింది.

ఈ హఠాత్పరిణామం ఒక్కసారిగా అక్కడి వారిని దిగ్భ్రమకు గురిచేసింది. రక్తం మడుగులో పడివున్న కూతుర్ని చూసి లక్ష్మీబాయి గుండెలవిసేలా రోదించారు. పదిహేడేళ్లకే ఒక్కగానొక్క కూతురికి నూరేళ్లు నిండిపోవడంతో ఆమె తీవ్ర విషాదంలో కూరుకుపోయారు.  పోలీసు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News