pethai cyclone: కోస్తాంధ్రను మళ్లీ వణికిస్తున్న తుపాను.. మరింత బలపడిన ‘పెథాయ్’

  • కలవరపెడుతున్న ‘పెథాయ్’
  • అల్లకల్లోలంగా సముద్రం
  • దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన 

‘పెథాయ్’ రూపంలో కోస్తాంధ్ర ప్రజలను మరో తుపాను వణికిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం మరింత తీవ్రతరమైంది. శుక్రవారం రాత్రికి మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 1090 కిలోమీటర్లు, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 930 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం ఈ తెల్లవారుజామున 5.30 గంటలకు మరింత బలపడింది. ఆదివారం రాత్రికి ఇది మరింత బలపడి తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణశాఖ తెలిపింది.

పెథాయ్ తీవ్ర తుపానుగా మారిన తర్వాత గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఫలితంగా సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది.

 సోమవారం మధ్యాహ్నానికి పెథాయ్ కాకినాడ, ఒంగోలు మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. తుపాను ప్రభావం కారణంగా నేడు, రేపు కోస్తాంధ్రలో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని, ఆ తర్వాత రెండు రోజులు దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉత్తరాంధ్రలో చెదురుమదురు వర్షాలు కురవనున్నట్టు పేర్కొన్నారు.

More Telugu News