Chandrababu: త్వరలోనే చంద్రబాబుకు మరో దెబ్బ తగలనుంది: జీవీఎల్

  • తెలంగాణలో తగిలిన దెబ్బకు బాబు ‘అబ్బా’ అన్నారు
  • రాఫెల్ డీల్ పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం
  • రక్షణ బలగాలకు రాహుల్, బాబు క్షమాపణ చెప్పాలి

తెలంగాణలో తగిలిన దెబ్బకు చంద్రబాబు ‘అబ్బా’ అనాల్సి వచ్చిందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుకు త్వరలోనే మరోదెబ్బ తగలనుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాఫెల్ డీల్ పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు.

రాఫెల్ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిరాధార ఆరోపణలు చేశారని విమర్శించారు. తప్పుడు ఆరోపణలు చేసిన రాహుల్, చంద్రబాబులు రక్షణ బలగాలకు, ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాఫెల్ డీల్ పై ఎలాంటి చర్చకైనా తాము సిద్ధమేనని, తప్పుడు కాంగ్రెస్ పంచన చేరిన చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ పార్టీలో అందరూ స్కాంలు చేసిన వారేనని, చంద్రబాబు ప్రతి స్కీమ్ ని స్కాంగా మార్చే వ్యక్తి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాఫెల్ వ్యవహారంపై ఆధారాలున్నప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్లలేదని కాంగ్రెస్, టీడీపీ నేతలను ప్రశ్నించారు. రాహుల్, చంద్రబాబు ఇద్దరూ ఒకే అబద్ధాన్ని పదేపదే చెప్పి నిజం చేయాలనుకుంటారని, తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏపీలో పునరావృతం కాబోతుందని జీవీఎల్ జోస్యం చెప్పారు.

More Telugu News