raghuram rajan: రైతు రుణమాఫీలు కొంప ముంచుతాయి: ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ హెచ్చరిక

  • రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై పెను ప్రభావాన్ని చూపుతాయి
  • ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుంది
  • పేదలకు కాకుండా ప్రభుత్వాలతో సంబంధం ఉన్న వారికే ఎక్కువ లబ్ధి చేకూరే అవకాశం ఉంది

రైతు రుణమాఫీ పథకాలు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ స్పష్టం చేశారు. రుణమాఫీల వల్ల రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలం అవుతాయని చెప్పారు. రుణమాఫీల వల్ల పేదలకు కాకుండా రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న వ్యక్తులకే ఎక్కువ లబ్ధి చేకూరే అవకాశం ఉందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, రాఘురాం రాజన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ఛత్తీస్ గఢ్ లో రైతురుణమాఫీ దిశగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అడుగులు వేస్తోంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల సహకారంతో రైతు రుణమాఫీ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. తన రాజీనామా సందర్భంగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 రోజుల్లోనే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పిందని... రైతులకు ఇచ్చిన హామీని ఆ పార్టీ నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నానని తెలిపారు. రైతు రుణమాఫీ విషయంలో ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు నానా తంటాలు పడుతున్న సంగతి తెలిసిందే.

More Telugu News