Twitter: రూ.18,000 చెల్లిస్తే ఇనుప ముక్క పంపారు.. సోనాక్షి సిన్హాకు షాక్ ఇచ్చిన అమెజాన్!

  • బాష్ హెడ్ ఫోన్లు బుక్ చేసిన నటి
  • ఇనుప బోల్టును పంపిన డీలర్
  • ట్వీట్టర్ లో బయటపెట్టిన సోనాక్షి

బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాకు ప్రముఖ షాపింగ్ వెబ్ సైట్ అమెజాన్ షాకిచ్చింది. ఆమె బాష్ హెడ్ ఫోన్స్ ఆర్డర్ పెట్టగా, ఓ ఇనుప బోల్టు ముక్కను పంపింది. దీంతో ఈ విషయంపై అమెజాన్ ప్రతినిధితో మాట్లాడేందుకు సోనాక్షి యత్నించగా, అవతలివైపు నుంచి సరైన స్పందన రాలేదు. దీంతో అమెజాన్ కంపెనీ వ్యవహారశైలిని తప్పుపడుతూ సోనాక్షి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ హెడ్ ఫోన్స్ కోసం రూ.18,000 చెల్లించానని ఆవేదన వ్యక్తం చేసింది.

ప్యాకింగ్ అంతా బాగానే ఉన్నప్పటికీ హెడ్ ఫోన్స్ కు బదులుగా ఇనుప బోల్టును పంపారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై అమెజాన్ ప్రతినిధులకు ఫోన్ చేయగా, ఒక్కరూ సరిగా స్పందించలేదని వాపోయింది. ఈ ట్వీట్ కు అమెజాన్ కంపెనీని ట్యాగ్ చేసింది. దీంతో అమెజాన్ కంపెనీ వెంటనే స్పందించింది. జరిగిన ఘటనపై తాము విచారిస్తున్నామని తెలిపింది. ఆర్డర్ కు సంబంధించిన వివరాలను తమకు అందించాలనీ, ఈ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

More Telugu News