Anantapur District: భర్త ఉడాయించాడు.. బస్టాండ్ లో కూర్చుని విలపించిన పుట్టపర్తి యువతి!

  • ప్రేమ పెళ్లి చేసుకున్న వారానికే భర్త పరార్
  • స్థానికులు గమనించి వివరాల సేకరణ
  • న్యాయం జరిపిస్తామని భరోసా

ప్రేమించానని వెంటపడ్డాడు. ఆ యువతి నమ్మింది. పెళ్లి చేసుకుంది. ఆపై వారం రోజుల వ్యవధిలోనే ఉడాయించాడు. దీంతో ఆ యువతి బోరుమంటూ విలపించింది. ఈ ఘటన అనంతపురం జిల్లా పుట్టపర్తి సమీపంలో చోటు చేసుకుంది. పెడపల్లి బస్టాండ్ లో ఓ యువతి ఏడుస్తూ కూర్చుని ఉండగా, చూసిన స్థానికులు ఆమెను పలకరించి వివరాలు అడగ్గా ఈ మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది.

బాధితురాలు తెలిపిన వివరాల మేరకు, పుట్టపర్తిలో సౌభాగ్యబాయి అనే యువతి టీటీసీ కోర్సు చేసింది. కోనాపురానికి చెందిన గోవర్ధన్‌ రెడ్డి అనే యువకుడు గత రెండేళ్లుగా ప్రేమిస్తున్నానంటూ వెంటపడగా నమ్మింది. వారం రోజుల క్రితం ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఆపై వారం రోజుల పాటు కాపురం చేసిన తరువాత గోవర్ధన్ కనిపించకుండా పోయాడు. అతని మొబైల్ ఫోన్ కు ప్రయత్నిస్తుంటే స్విచ్చాఫ్ వస్తోంది.

నిన్న తన భర్త కోసం కోనాపురం వెళ్లి చూడగా, ఇంటికి తాళం వేసి ఉంది. దీంతో చేసేదేమీ లేక, తిరిగి తన ఊరికి బయలుదేరి మార్గం మధ్యలో పెడపల్లి బస్టాండ్‌ లో దిగింది. అక్కడే కూర్చుని తనలో తానే కన్నీటి పర్యంతమవుతూ గ్రామస్థుల కంటపడింది. ఆమెను చేరదీసి ఓదార్చిన వారు, న్యాయం జరిపిస్తామని భరోసా ఇచ్చారు.

More Telugu News