shashi tharoor: వైరల్ అవుతున్న కెమిస్ట్రీ మేడం శుభలేఖ.. శశిథరూర్ సరదా స్పందన

  • వెరైటీగా పెళ్లి శుభలేఖను డిజైన్ చేసిన కెమిస్ట్రీ టీచర్
  • సోషల్ మీడియాలో వైరల్
  • జీవితంలో ఉష్ణానికి చోటివ్వద్దంటూ థరూర్ ట్వీట్

పెళ్లి శుభలేఖ అనగానే వధూవరుల పేర్లు, వివాహం.. విందుకు సంబంధించిన వివరాలే ఉంటాయి. ఎవరు ఏ భాషలో అచ్చు వేయించినా ఇవి తప్పనిసరి. అయితే, ఇటీవల యువత తమ శుభలేఖలను తామే కొంచెం వెరైటీగా, ఆకట్టుకునేలా డిజైన్ చేసుకుంటున్నారు. అవే వివరాలకు కొంచెం సృజనాత్మకత జోడిస్తున్నారు. తాజాగా, కేరళకు చెందిన కెమిస్ట్రీ ఉపాధ్యాయురాలు విధున్ డిజైన్ చేసిన పెళ్లి పత్రిక చూస్తే మాత్రం ‘ఔరా’ అనిపించకమానదు. ఆర్గానిక్ కెమిస్ట్రీలోని రసాయన బంధాలను గుర్తుకు తెచ్చేలా, చూడగానే సైన్స్ గుర్తుకు వచ్చేలా డిజైన్ చేయించారు. అనంతరం దానిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఈ శుభలేఖను చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కామెంట్లతో టీచర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తూ మ్యారేజ్ విషెస్ చెబుతున్నారు. వైరల్ అయిన ఈ శుభలేఖను చూసిన కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కూడా అంతే సరదాగా స్పందించారు. కొత్త జంటకు వివాహ శుభాకాంక్షలు చెబుతూనే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ మెరుపుల్లా వెదజల్లాలని, ఫిజిక్స్‌లో ఉండే ఉష్ణానికి చోటివ్వకుండా, మీ జీవితంలో కాంతి మెరవాలని, దాని ఫలితం బయాలజీలా ఉండాలని ట్వీట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ కూడా విపరీతంగా వైరల్ అవుతోంది.

More Telugu News