Jammu And Kashmir: ఉగ్రవాదిగా మారిన బాలీవుడ్ నటుడు.. కశ్మీర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో హతం!

  • విషాదాంతంగా ముగిసిన బిలాల్ కథ
  • హైదర్ సినిమాతో వెలుగులోకి వచ్చిన నటుడు
  • లష్కరే ఉచ్చులో చిక్కుకుంటున్న యువత

జమ్మూకశ్మీర్ లోని బందిపొరా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఇక్కడి సోపోర్ పట్టణంలో ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాలు పోలీసులకు సమాచారం అందించాయి. దీంతో రంగంలోకి దిగిన భద్రతాబలగాలు నిన్న రాత్రి ఉగ్రవాదులు నక్కిన ఇంటిని చుట్టుముట్టాయి. అప్పటి నుంచి ఈ రోజు ఉదయం వరకూ కాల్పులు కొనసాగాయి. కాగా, ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు.

కాగా, ఈ ఘటనలో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఎన్ కౌంటర్ లో బాలీవుడ్ సినిమా ‘హైదర్’ లో నటించిన సకీబ్ బిలాల్ అహ్మద్(17) చనిపోయినట్లు అధికారులు గుర్తించారు. సినిమాలో షాహీద్ కపూర్ చిన్నప్పటి పాత్రలో బిలాల్ నటించాడు. ఈ ఎన్ కౌంటర్ లో బిలాల్ తో పాటు ఉగ్రవాదిగా మారిన ముదసిర్ అహ్మద్(14) అనే బాలుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు.

వీరిద్దరూ ఈ ఏడాది ఆగస్టు 31న ఇంటి నుంచి అదృశ్యమయ్యారు. కశ్మీర్ లో విద్యార్థులను, ముఖ్యంగా మైనర్ యువతను ఆకర్షించేందుకు లష్కరే తోయిబా ఉగ్రవాదులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకూ దాదాపు 450 మంది యువకులను లష్కరే తోయిబా సంస్థ ఉగ్రవాదులుగా మార్చింది.

More Telugu News