Telangana: మహమూద్ అలీకి ప్రగతిభవన్ నుంచి ఫోన్.. కేసీఆర్ తో పాటు ప్రమాణస్వీకారం!

  • 88 స్థానాల్లో గెలుపొందిన టీఆర్ఎస్ 
  • మధ్యాహ్నం 1.25 గంటలకు కేసీఆర్ ప్రమాణం
  • రాజ్ భవన్ కు చేరుకున్న ఎమ్మెల్యేలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. మొత్తం 119 స్థానాలకు గానూ టీఆర్ఎస్ 88 చోట్ల విజయం సాధించగా, మరో ఇద్దరు స్వతంత్రులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో అసెంబ్లీలో టీఆర్ఎస్ బలం ఏకంగా 90కు చేరుకుంది. మరోవైపు కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం 1.25 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాగా, ఈ నేపథ్యంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.

ఈరోజు మధ్యాహ్నం రాజ్ భవన్ లో కేసీఆర్ ఒక్కరే ప్రమాణస్వీకారం చేస్తారని తొలుత భావించారు. అయితే తాజాగా తెలంగాణ మాజీ ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీకి కేసీఆర్ నివాసం ప్రగతి భవన్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది.
ఈరోజు కేసీఆర్ తో పాటు మహమూద్ అలీ కూడా ప్రమాణస్వీకారం చేస్తారని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. కాగా, కేసీఆర్ ప్రమాణస్వీకారం నేపథ్యంలో టీఆర్ఎస్ నూతన ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, కేసీఆర్ కుటుంబీకులు ఇప్పటికే రాజ్ భవన్ కు చేరుకున్నారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం నిరాడంబరంగా సాగనుంది.

More Telugu News