Chandrababu: కేసీఆర్ ఇచ్చే ఆ బహుమతి ఏంటో చూడాలని చాలా ఆతృతగా ఉన్నా: రోజా

  • చంద్రబాబుకు బుద్ధి చెప్పిన తెలంగాణ ప్రజలు
  • ఏపీ ప్రజలు కూడా తరిమేసేందుకు సిద్ధం
  • గుంటూరులో మీడియాతో రోజా

చంద్రబాబునాయుడికి కేసీఆర్ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏంటో చూడాలని తనకు ఎంతో ఆత్రుతగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా వ్యాఖ్యానించారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆమె, తెలంగాణ ప్రజలు చంద్రబాబుకు, రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పారని విమర్శించారు. ఏపీలో అభివృద్ధి ఎక్కడా జరగడం లేదని, తెలంగాణ ప్రజలు చంద్రబాబును తరిమినట్టే, ఏపీ ప్రజలు కూడా తరిమేయనున్నారని రోజా జోస్యం చెప్పారు.

రాజకీయ సన్యాసం తీసుకున్న లగడపాటి ఏ ఉద్దేశంతో తెలంగాణ నేతలతో చాటింగులు చేశారో చెప్పాలని, టీడీపీ, టీఆర్ఎస్ మధ్య పొత్తు కుదర్చాలని ఎందుకు మధ్యవర్తిత్వం చేశారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఆయన సర్వేలను ఇకపై నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పొత్తుపై సీనియర్ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజమయ్యాయని రోజా వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ఇచ్చే బహుమతి ఏదో కేసీఆర్ త్వరగా ఇవ్వాలని కోరారు.

More Telugu News