Tamilnadu: ప్రియుడితో మాట్లాడుతుంటే తల్లి తిట్టిందని యువతి ఆత్మహత్య... విషయం తెలిసి ఉరేసుకున్న ప్రియుడు!

  • తమిళనాడులోని చిదంబరం ప్రాంతంలో ఘటన
  • ప్రియురాలి అంత్యక్రియలకు వెళ్లి వచ్చి ఆత్మహత్య
  • ఆసుపత్రిలో మృతదేహాన్ని కొరికిన ఎలుకలు
  • ఆందోళన చేస్తున్న బంధుమిత్రులకు సర్దిచెప్పిన పోలీసులు

ప్రియుడితో మాట్లాడుతున్న తన కుమార్తెను ఓ తల్లి మందలించగా, మనస్తాపంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు ఉరేసుకుని మరణించగా, రెండు కుటుంబాలు విషాదంలో మునిగాయి. ఈ ఘటన తమిళనాడులోని చిదంబరంలో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, సొక్కలింగం నగర్‌ కు చెందిన వైదీశ్వరన్‌ (22), బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ చదివి కొంత కాలం విదేశాల్లో ఉద్యోగం చేసి వచ్చాడు.

ఆపై కీళమూంగిలడిలో ఉండి బీఎస్సీ తృతీయ సంవత్సరం చదువుతున్న రత్తినప్రియ (21) అనే యువతితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా భావించారు. ఈ క్రమంలో రత్తినప్రియ, తన ప్రియుడితో సెల్‌ ఫోన్‌ లో మాట్లాడుతుండగా, ఆమె తల్లి ఇంద్ర గమనించి తిట్టింది. దీంతో రత్తినప్రియ తన ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు వదలగా, విషయం తెలుసుకున్న వైదీశ్వరన్, ఆమె అంత్యక్రియలకు వెళ్లి వచ్చాడు. ఆపై రాత్రి పూట, ఇంట్లోని ఫ్యాన్ కు ఉరేసుకుని మరణించాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు, అతని మృతదేహాన్ని పోస్టుమార్టం గదికి తరలించారు. ఆపై మృతదేహం కోసం వైదీశ్వరన్ బంధుమిత్రులు రాగా, అతని మృతదేహాన్ని ఎలుకలు కొరికినట్టు కనిపించింది. దీంతో వారంతా ఆసుపత్రి ముందు నిరసనలకు దిగారు. పోలీసులు వారికి నచ్చజెప్పి పంపాల్సివచ్చింది.

More Telugu News