Telangana: గెలిచిన 119 మందిలో 67 మంది నేరచరితులే!

  • టీఆర్ఎస్ లో సగం మంది నేరచరితులే
  • కూటమి నుంచి గెలిచిన 21 మందిలో 16 మందిపై కేసులు
  • వెల్లడించిన ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. నూతనంగా 119 మంది ఎమ్మెల్యేలు ఎన్నికైనప్పటికీ, వీరిలో అత్యధికులు గత శాసనసభలో ఉన్నవారే. నూతనంగా ఎన్నికైన 119 మంది శాసనసభ్యుల్లో వివిధ పార్టీలకు చెందిన 67 మంది నేరచరితులేనని ఫోరమ్ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సంస్థ వెల్లడించింది. వీరందరిపై సివిల్, క్రిమినల్‌ కేసులు పెండింగ్‌ లో ఉన్నాయని, సంస్థ కన్వీనర్‌ పద్మనాభరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

టీఆర్‌ఎస్‌ నుంచి ఎన్నికైన 88 మంది ఎమ్మెల్యేల్లో 44 మందిపై పలు కేసులు ఉన్నాయని, బీజేపీ నుంచి ఎన్నికైన ఒకేఒక్కడు రాజాసింగ్ పై ఎన్నో కేసులున్నాయని ఆయన అన్నారు. ఇక కూటమి నుంచి గెలిచిన 21 మందిలో 16 మందిపై ఎంఐఎంకున్న ఏడుగురు ఎమ్మెల్యేల్లో ఆరుగురిపై పెండింగ్ కేసులు ఉన్నాయని అన్నారు.

ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తమపై ఉన్న కేసుల గురించి ప్రధాన పత్రికలు, టీవీ చానళ్లలో కనీసం మూడు సార్లు ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు చెప్పిన తీర్పును అత్యధికులు పాటించలేదని ఆరోపించిన పద్మనాభరెడ్డి, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లిందని చెప్పారు.

More Telugu News