Andhra Pradesh: 'శభాష్.. నేను చెప్పినట్లే గంతులేశావ్'.. లగడపాటి సర్వేపై వ్యంగ్యంగా స్పందించిన విజయసాయిరెడ్డి!

  • 88 స్థానాలు దక్కించుకున్న టీఆర్ఎస్
  • కేవలం 35 వరకే వస్తాయన్న లగడపాటి
  • ఏపీలో వైసీపీ, జనసేన కార్యకర్తల సంబరాలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో ఈసారి మహాకూటమి(ప్రజా కూటమి) అధికారంలోకి రాబోతోందనీ, టీఆర్ఎస్ 35 సీట్లకు మించదని పార్లమెంటు మాజీ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఇచ్చిన సర్వే తలకిందులయింది. కాగా, టీఆర్ఎస్ విజయంతో ఇటు తెలంగాణలో సంబరాలు మిన్నంటగా, అటు ఏపీలో ప్రతిపక్ష వైసీపీ, జనసేన పార్టీలు టీడీపీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నాయి. తాజాగా తెలంగాణ ఫలితాలు-లగడపాటి సర్వేపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి వ్యంగ్యంగా స్పందించారు.

విశాఖ బీచ్ లోని ఇసుకలో లగడపాటి గాల్లో గంతులు వేస్తుండగా, పక్కనే చంద్రబాబు నిలబడి ఉన్న మెమెను సాయిరెడ్డి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. అనంతరం ‘శభాష్.. నేను చెప్పినట్లే గంతులేశావ్! నువ్వు అప్పులను ఎగ్గొట్టడానికి బ్యాంకులను నేను మేనేజ్ చేస్తా’ అని చంద్రబాబు చెప్పినట్లు, దానికి లగడపాటి ‘థాంక్యూ బాస్’ అని జవాబిచ్చినట్లు క్యాప్షన్ ను జతచేశారు. ఈ మేరకు ఓ సందేశాన్ని సాయిరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.

More Telugu News