Telangana: అడ్డుకుని నిలదీశారు.. ఆపై ఓట్లేసి గెలిపించారు: టీఆర్ఎస్‌కే జై కొట్టిన ముంపు గ్రామాల ప్రజలు

  • ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్థిని అడ్డుకున్న గ్రామస్థులు
  • ఓట్లు వేసేది లేదని స్పష్టీకరణ
  • చివరికి ఆయనకే పట్టం

మహబూబ్‌నగర్‌లోని ముంపు గ్రామాల ప్రజలు టీఆర్ఎస్‌కే జైకొట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ జడ్చర్ల అభ్యర్థి లక్ష్మారెడ్డికే మద్దతు పలికారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముంపు గ్రామాలైన వల్లూరు, ఉదండాపూర్‌లలో టీఆర్ఎస్ జడ్చర్ల అభ్యర్థి లక్ష్మారెడ్డి పర్యటించారు. ఆయనను అడ్డుకున్న గ్రామస్థులు ఉదండాపూర్ రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించి, తమ గ్రామాలను ముంపు బారి నుంచి కాపాడాలని ఆందోళన చేపట్టారు. ఆయనకు ఓట్లు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

అదే సమయంలో ముంపు గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి మాట్లాడుతూ.. ఉదండాపూర్ రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటానని, ముంపు నుంచి గ్రామాలను కాపాడతానని హామీ ఇచ్చారు. దీంతో ఆయా గ్రామాల ఓట్లన్నీ మల్లు రవికే పడతాయని అందరూ ఊహించారు. అయితే, ఓట్లేయబోమని చెప్పిన లక్ష్మారెడ్డికే ముంపు గ్రామాల ప్రజలు పట్టం కట్టారు. ఈ రెండు గ్రామాల్లో కలిపి లక్ష్మారెడ్డికి 415 ఓట్ల మెజారిటీ వచ్చింది. లక్ష్మారెడ్డికి 1500ఓట్లు రాగా, మల్లు రవికి 1085 ఓట్లు వచ్చాయి.

More Telugu News