Chandrababu: చంద్రబాబు కుట్రను జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ గుర్తించారు: రోజా

  • తెలంగాణలో టీడీపీని కాపాడుకోలేక పోయారు
  • టీడీపీ, కాంగ్రెస్ ఓటమితో ప్రజలు సంతోషంగా ఉన్నారు
  • కేసీఆర్ మాదిరే జగన్ ను ప్రజలు ఆశీర్వదించాలి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. జాతీయ నాయకుడినని చెప్పుకునే చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో టీడీపీని కాపాడుకోలేక పోయారని, ఇక దేశాన్ని ఏం కాపాడుతారని ఆమె ఎద్దేవా చేశారు. టీడీపీ, కాంగ్రెస్ ఓటమితో ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు. ఏపీ ప్రజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా టీడీపీ ఓడిపోవడం గమనార్హమని తెలిపారు. ఏపీలో చంద్రబాబు అరాచకాలను వినే, ఇక్కడ టీఆర్ఎస్ కు ఓటు వేశారని చెప్పారు. చంద్రబాబును నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని... ఏపీలో కూడా టీడీపీని తిప్పి కొడతారని అన్నారు. లగడపాటి సర్వేల సన్యాసం తీసుకోవాలని తెలిపారు.

రాజశేఖర్ రెడ్డి లేని కాంగ్రెస్ పార్టీ తల లేని మొండెం వంటిదని రోజా చెప్పారు. వైయస్ కుమారుడు జగన్ ను జైల్లో పెట్టించిన కాంగ్రెస్ కు ప్రజలు మంచి గుణపాఠం చెప్పారని అన్నారు. మీడియా, డబ్బు అండతో ఎన్నికల్లో గెలవాలనే చంద్రబాబు యత్నాలు ఫలించబోవని చెప్పారు. కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు ఆశీర్వదించిన విధంగానే, జగన్ ను ఏపీ ప్రజలు ఆశీర్వదించాలని... అప్పుడే రాష్ట్రంలో రాజన్న రాజ్యం వస్తుందని అన్నారు. చంద్రబాబు కుట్రను జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు గుర్తించారని చెప్పారు. నందమూరి సుహాసిని రాజకీయ జీవితాన్ని చంద్రబాబు నాశనం చేశారని విమర్శించారు. 

More Telugu News