Telangana: తెలంగాణలో కాంగ్రెస్ ఓటమి.. బండ్ల గణేశ్ ను ఓ రేంజ్ లో ఆడుకుంటున్న నెటిజన్లు!

  • ఓటమిని అంగీకరిస్తున్నామన్న గణేశ్
  • టీఆర్ఎస్ కు శుభాకాంక్షలు తెలిపిన నేత
  • ఇంటికి బ్లేడు బాక్సు పట్టుకెళ్లిన జర్నలిస్ట్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇప్పటికి 72 స్థానాల్లో ఘనవిజయం సాధించింది. మరో 14 స్థానాల్లో ఆధిక్యం దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, సినీనిర్మాత బండ్ల గణేశ్ స్పందించారు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని తెలిపారు. ఈ ఓటమిని కాంగ్రెస్ పార్టీ అంగీకరిస్తోందని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

కాగా, గతంలో ఓ ఇంటర్వ్యూ సందర్భంగా కాంగ్రెస్ ఈసారి అధికారంలోకి రాకుంటే బ్లేడుతో గొంతు కోసుకుంటానని బండ్ల గణేశ్ ప్రకటించారు. అక్కడితో ఆగకుండా ఫలితాల అనంతరం మీడియా మిత్రులు బ్లేడులు, కత్తులు తీసుకురావాలని కోరారు.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో నెటిజన్లు బండ్ల గణేశ్ ను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. ‘ ఆ బండ్ల గణేశ్‌ ఎక్కడా?.. కత్తులు సిద్ధంగా ఉన్నాయ్‌.. గొంతు కోసుకోవడానికి సిద్ధమా?’ అని ప్రశ్నిస్తూ సెటైర్లు వేస్తున్నారు. జోకులతో మెమెలను పోస్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా బండ్లను ఇంటర్వ్యూ చేసిన ఓ చానెల్ జర్నలిస్ట్‌.. స్వీట్‌ బాక్స్‌తో పాటు బ్లేడ్‌లతో ఆయన ఇంటికి వెళ్లగా, ఇంటిలో నుంచి బయటకు వచ్చేందుకు బండ్ల గణేశ్ నిరాకరించారట!

More Telugu News