Telangana: తెలంగాణలో మేము పడ్డ కష్టానికి సరైన ఫలితం రాలేదు: జీవీఎల్

  • మా ఐదు స్థానాలను నిలుపుకోలేకపోయాం
  • టీఆర్ఎస్ కు ఎక్కువ స్థానాలు రావడానికి కారణం బాబే
  • బాబు చేసిన ఆర్భాటం వల్లే ఇదంతా జరిగింది

తెలంగాణలో గతంలో తాము సాధించిన ఐదు స్థానాలను నిలుపుకోలేకపోయామని, తాము పడ్డ కష్టానికి వచ్చిన ఫలితం ఇది కాదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాకపోతే, ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేల పనితీరును ఆధారంగా చేసుకుని ప్రజలు ఓట్లు వేసినా కూడా టీఆర్ఎస్ ఇన్ని స్థానాల్లో విజయం సాధించేది కాదని అన్నారు.

టీఆర్ఎస్ ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడానికి కారణం చంద్రబాబేనని, ఆయన చేసిన ఆర్భాటం వల్లే ఇదంతా జరిగిందని అన్నారు. ఏపీలో నాలుగైదు నెలల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలు కావడం ఖాయమని అభిప్రాయపడ్డారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఆధిక్యత లభించకపోయినన్పటికీ, లోక్ సభ ఎన్నికల్లో తమకు ఈ స్థితి పునరావృతం కాదని అన్నారు.

గెలుపునైనా, ఓటమినైనా స్వీకరించి, దానిపై విశ్లేషణ చేసుకునే పార్టీ బీజేపీ అని ఆయన అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయని, వీటి ఫలితాలు లోక్ సభ ఎన్నికలపై ఉండదని అభిప్రాయపడ్డారు. 

More Telugu News