Assembly: హంగ్ వస్తుందన్న భావనలో కాంగ్రెస్... ఇద్దరు టీఆర్ఎస్ తిరుగుబాటు అభ్యర్థులకు మంత్రి పదవుల ఆఫర్!

  • నేడు వెల్లడికానున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
  • కోరుకంటి చందర్ కు క్యాబినెట్ పదవి
  • ఇప్పటికే తన మద్దతు కాంగ్రెస్ కేనన్న మల్ రెడ్డి రంగారెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెల్లడికానున్న నేపథ్యంలో, కాస్తంత అటూ ఇటూ అయినా, అధికారాన్ని చేజార్చుకోరాదన్న ఉద్దేశంలో ఉన్న కాంగ్రెస్ బేరసారాలు మొదలుపెట్టింది. హంగ్‌ ఏర్పడవచ్చన్న భావనలో ఉన్న కాంగ్రెస్‌, కౌంటింగ్‌ కు ముందు రోజే ఇండిపెండెంట్‌ అభ్యర్థులతో రాయబారాలు నడిపింది.

రామగుండం టీఆర్‌ఎస్‌ తిరుగుబాటు అభ్యర్థి కోరుకంటి చందర్‌ కు, మహబూబ్‌ నగర్‌ జిల్లా నారాయణపేట తిరుగుబాటు అభ్యర్థి శివకుమార్‌ రెడ్డితోనూ నేతలు సంప్రదింపులు జరిపినట్టు, క్యాబినెట్ పదవుల ఆశ కల్పించినట్టు తెలుస్తోంది. ఇక ఇబ్రహీంపట్నం నుంచి బీఎస్‌పీ తరపున పోటీ చేసిన మల్‌ రెడ్డి రంగారెడ్డి, తాను గెలిస్తే మద్దతు కాంగ్రెస్‌ కేనని ఇప్పటికే తేల్చి చెప్పారు. కచ్చితంగా గెలుస్తారనుకునే స్వతంత్ర అభ్యర్థుల మద్దతు ఈ ఫలితాల తరువాత కీలకం కావచ్చన్న ఉద్దేశంలో ఉన్న కాంగ్రెస్ వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడింది.

More Telugu News